Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడైన వెంకన్నకు భక్తులు సమర్పించే కానుకలతో అనేక విలువైన ఆభరణాలు సమకూరుతున్నాయి. తాజాగా శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం తరఫున 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు స్వామివారికి సమర్పించబడ్డాయి. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ, రూ.1.80 కోట్ల విలువ గల ఈ కానుకలను సమర్పించారు.
![]() |
Lord Balaji |
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ ఈ బంగారు, వెండి కానుకలను పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్ స్వామితోపాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామీజీకి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అదే సమయంలో, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు సమర్పించరాదని టీటీడీ ముఖ్య గమనిక విడుదల చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, ఆ కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది.